“జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|

0
20

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాంకీ సంస్థను తీవ్రంగా ప్రశ్నిస్తూ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాంకీతో ఒప్పందం చేసుకున్న సమయంలో దుర్వాసనలు రావని, కాలుష్యం ఉండదని, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదని, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు.

అయితే గత 15 ఏళ్లుగా రోజుకు వేల మెట్రిక్ టన్నుల చెత్తను నిర్వహిస్తున్నప్పటికీ, ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు.

జవహర్‌నగర్ సమస్యపై నిన్న, ఈరోజు నిర్వహించిన సమావేశాల్లో పార్టీలకు అతీతంగా కమిషనర్ విజయకృష్ణకు స్పష్టమైన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

సమస్య పరిష్కారానికి విదేశాలకు వెళ్లి టెక్నాలజీలు వెతకాల్సిన అవసరం లేదని, దేశంలోనే ఇందోర్ నగరంలో తెలుగు ఐఏఎస్ అధికారి నరహరి ఆధ్వర్యంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఆర్గానిక్ మాన్యూర్ తయారీ వంటి ఆధునిక విధానాలతో జీరో పొల్యూషన్ దిశగా విజయవంతమైన నమూనా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడ ఉన్న అత్యుత్తమ సాంకేతికత అయినా తీసుకురావాలని, కానీ జవహర్‌నగర్‌లో కాలుష్యం లేకుండా, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా, ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా పూర్తి స్థాయి పరిష్కారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ లక్ష్యం నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 16 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలేనని చెప్పారు.

ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు. గతంలో ఈ సమస్యపై పోరాడిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో, అప్పటి హామీలను కార్యరూపం దాల్చించాలని కోరారు.

జవహర్‌నగర్ ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు తాము వారి పక్షానే నిలబడతామని ఎంపీ స్పష్టం చేశారు.

#Sidhumaroju

Alwal