మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక వినతిపత్రాలను అందజేశారు.
అల్వాల్ ప్రాంత ప్రజల భద్రతకు అత్యంత అవసరమైన ఫైర్ స్టేషన్ నిర్మాణ అంశాన్ని ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావించారు.
అల్వాల్ గ్రామ కంఠం స్థలంలో 11 గుంటల భూమిని ఫైర్ స్టేషన్ కోసం కేటాయించే ప్రక్రియకు సంబంధించిన ఎమ్మార్వో లేఖలు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన పత్రాలను కమిషనర్కు అందజేశారు.
ఫైర్ స్టేషన్ నిర్మాణంపై నెలకొన్న అపోహలను తొలగించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పనులను వేగవంతం చేయాలని కోరారు.
అదేవిధంగా చాణిక్యపురి పార్క్ అభివృద్ధి, నియోజకవర్గంలోని పార్కులను ఆధునీకరించి ఓపెన్ జిమ్ల ఏర్పాటు, బండ చెరువు అభివృద్ధి, చెరువులకు సంబంధించిన న్యాయపరమైన వివాదాల పరిష్కారం అనంతరం అభివృద్ధి పనుల ప్రారంభం, పలు కాలనీల్లో బాక్స్ డ్రైన్లు మరియు సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే ఆర్కేఎచ్ కాలనీలోని పార్కు స్థల పరిరక్షణ వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు.
సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, ఇంజనీరింగ్ ప్రాజెక్టు అధికారులు, మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju










