“గోవాలో దొరికిన ఢిల్లీ దొంగ.. రూ.82 లక్షల సొత్తు రికవరీ చేసిన మార్కెట్ పోలీసులు”|

0
0

సికింద్రాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పోలీసుల చాకచక్యంతో భారీ ఇంటి చోరీ కేసు ఛేదించబడింది. ఇంటి తాళాలు పగులగొట్టి లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించిన అంతర్రాష్ట్ర దొంగను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు, చోరీకి గురైన మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, పోట్ మార్కెట్ ప్రాంతానికి చెందిన సందీప్ రఘునాథ్ చవాన్ అనే వ్యక్తి ఈ నెల 27న రాత్రి ఇంట్లో చోరీ జరిగినట్లు మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తాను ఉద్యోగ నిమిత్తం బయట ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి చెక్క పెట్టెలో భద్రపరిచిన బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నాడు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మార్కెట్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నిందితుడు గోవాలో తలదాచుకున్నట్లు గుర్తించారు. అనంతరం ప్రత్యేక బృందం ఉత్తర గోవాలోని కలంగుట్ ప్రాంతానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుంది.

అరెస్టైన వ్యక్తిని ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మనోజ్ సింగ్‌గా గుర్తించారు. విచారణలో అతడు అలవాటైన అంతర్రాష్ట్ర దొంగ అని తేలింది. ఢిల్లీలో అతనిపై 19 చోరీ కేసులు నమోదై ఉండటంతో పాటు పలు నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో తిహార్ జైలులో కూడా శిక్ష అనుభవించినట్లు గుర్తించారు.

ఈ కేసులో చోరీకి గురైన సుమారు 576 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి సహా మొత్తం రూ.82 లక్షల విలువైన ఆస్తిని నిందితుడి వద్ద నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

ఏసీపీ వి. యాదగిరి రెడ్డి నాయకత్వంలో, మార్కెట్ ఇన్‌స్పెక్టర్ వి. రామ్‌చందర్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎం. బషీర్ అహ్మద్, ఎస్సైలు. నరేష్, ఎ. నరేష్, రవి, తదితర సిబ్బంది ఈ కేసును ఛేదించారు.

మల్కాజిగిరి జోన్ డీసీపీ. శ్రీధర్, ఐపీఎస్ పర్యవేక్షణలో, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి, ఐపీఎస్. మార్గదర్శకత్వంలో చేపట్టిన దర్యాప్తు ఫలితంగా నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేయగలిగారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రజల సహకారంతోనే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.

#Sidhumaroju