*మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి… లేకపోతే జైలుకే*
*డి-అడిక్షన్ సెంటర్ను సందర్శించిన సీపీ*
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై చికిత్స పొందుతున్న వ్యక్తులను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్తో కలిసి శుక్రవారం సందర్శించారు. గంజాయి నిర్మూలనతో పాటు గంజాయికి బానిసైన వారిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీపీ,15 రోజుల చికిత్సా కాలంలో ప్రతి ఒక్కరిలో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు.
వైద్య సిబ్బందితో మాట్లాడుతూ, గంజాయి బాధితుల్లో సత్ప్రవర్తన, సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని,వారి ప్రవర్తనలో లేదా శారీరక పరిస్థితిలో ఏవైనా అసాధారణ మార్పులు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.చికిత్స అనంతరం మళ్లీ మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.గంజాయి విక్రేతలు,మత్తు పదార్థాల సరఫరాదారులపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు.డ్రగ్స్ రహిత కమిషనరేట్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, వైద్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.










