కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్… సీఎం సువేందు అధికారితో కీలక భేటీ.|

0
0

 

కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్… సీఎం సువేందు అధికారితో కీలక భేటీ

 

Andhra

Nara Lokesh visits Kolkata for key meeting with Suvendu Adhikari

పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఏపీ మంత్రి లోకేశ్ 

ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగాన్ని వివరించిన వైనం

బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి

మత్స్య సంపద ఎగుమతుల్లో పరస్పర సహకారంపై ఇరువురి మధ్య చర్చ

లోకేశ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సువేందు అధికారి

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక సమావేశం జరిగింది. ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించారు.

 

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్.. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పాలనా విధానాలను సువేందు అధికారికి వివరించారు. టెక్నాలజీని ఉపయోగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్న తీరును, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్న వైనాన్ని తెలియజేశారు. డిజిటల్ గవర్నెన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

అదే సమయంలో, పశ్చిమ బెంగాల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ‘పశ్చిమ బెంగాల్ భవన్’ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. మత్స్య సంపద పెంపు, ఎగుమతుల విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. మంత్రి లోకేశ్ చేసిన ప్రతిపాదనలపై సీఎం సువేందు అధికారి సానుకూలంగా స్పందించారు.

 

కాగా, లోకేశ్ రేపు కోల్ కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐ.సి.సి) ఆధ్వర్యంలో జరిగే ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు అనే సదస్సులో పాల్గొంటారు.