మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన SIR అవగాహన సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి గజమాలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు.
సభలో ప్రసంగించిన ఈటల రాజేందర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు.
సామాన్యుడైనా, సంపన్నుడైనా ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే విలువ ఉంటుందని, దేశ దిశను నిర్దేశించే శక్తి ఓటు ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఎన్నికల జాబితాల్లో లోపాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. కొందరి పేర్లు నమోదు కాకపోవడం, మరికొందరి వివరాలు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉండటం వంటి సమస్యలను సరిదిద్దడానికే కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రక్రియ పారదర్శక ఎన్నికల నిర్వహణకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
అయితే కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజల్లో అనవసర అనుమానాలు సృష్టిస్తున్నాయని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడుతుందనే వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.
గతంలో నకిలీ నమోదు కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రభావితమైందని, అలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడుతుందనే ఆందోళనతోనే కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. పారదర్శక విధానాలు అమల్లోకి వస్తే ప్రజల అసలైన అభిప్రాయం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఎన్నికల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కార్యక్రమాలకు సహకరించాలని, నిరాధార ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju










