మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తాలూకా సీఐ కళా వెంకటరమణ సోమవారం మీడియాకు వెల్లడించారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ రామిరెడ్డిగారిపల్లె గ్రామానికి చెందిన తరిగొండ శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, ఎం. సుధాకర్లు పొన్నేటిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని రామిరెడ్డిగారిపల్లె శివారులో సర్వే నంబర్ 360లో ఉన్న 3,300 చదరపు అడుగుల (55×60) ఇంటి స్థలాన్ని 2023లో స్థానిక నక్కలదిన్నెకు చెందిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ దేవేంద్రకు రూ.11.15 లక్షలకు విక్రయించారు.
అయితే అదే స్థలాన్ని ఇప్పటికే 2014, 2020 సంవత్సరాల్లో ఇతరులకు విక్రయించి వారి నుంచి కూడా నగదు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాధితుడు దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)కు అనుగుణంగా మోసానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.










