ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|

0
3

– భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం

– లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి.

హైదరాబాద్, జూలై 18: ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు.

అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత కోసం అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

భక్తులు దర్శనం సమయంలో తోపులాటలకు గురికాకుండా భారీ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని గణనీయంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

గతంలో అమ్మవారి కళ్యాణానికి సుమారు 20 వేల మంది భక్తులు హాజరయ్యేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 7 నుంచి 8 లక్షలకు చేరుకుందని చెప్పారు. వారానికి లక్ష మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని పేర్కొన్నారు.

#Sidhumaroju