ఆసిఫాబాద్ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఐఐటీయూసీ AITUC డిమాండ్

0
75

🎤భారత్ ఆవాజ్ న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేయడం ఆపి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టి.ఎస్. ఆటో రిక్షా డ్రైవర్స్ & వర్కర్స్ ఫెడరేషన్ (AITUC) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో పరిపాలనాధికారి (AO) అరుణకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ మాట్లాడుతూ. తెలంగాణలో లక్షలాది ఆటో డ్రైవర్లు రవాణా సేవలు అందిస్తున్నా ప్రభుత్వం వారిని కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా గత పదేళ్లుగా ఆటో మీటర్ చార్జీలు పెంచకపోవడం దారుణమన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిని రోడ్డున పడినా ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా, ఊబర్, రాపిడో లాంటి కార్పొరేట్ కంపెనీలు డ్రైవర్లను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే వాటిని నిషేధించి ప్రభుత్వమే సొంతంగా యాప్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని, అర్హులైన డ్రైవర్లందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంతో పాటు ఈ-చలానా, రేడియం, ఫిట్‌నెస్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలన్నారు.గత 30 ఏళ్లుగా ఆటో, రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు కోసం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీనివల్ల డ్రైవర్ చనిపోతే వారి కుటుంబాలు దిక్కులేకుండా పోతున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆటోల చక్రాలు ఆపి పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు బి. సుధాకర్, కె. మహేష్ తదితరులు పాల్గొన్నారు.