టిమ్స్‌పై సమరం.. క్రిషాంక్ స్వరం.|

0
23

● కంటోన్మెంట్ పరిధిలోని టిమ్స్ ఆసుపత్రి పనుల పరిశీలన

● టిమ్స్, తిరుమలగిరి చెరువు అంశాలపై మన్నె క్రిషాంక్ ప్రశ్నలు

● కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 29: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ బుధవారం సందర్శించి, అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం, తిరుమలగిరి చెరువు అభివృద్ధి పనులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

తిరుమలగిరి చెరువు అభివృద్ధి పనులను తాము ప్రారంభించిన తర్వాత ఎమ్మెల్యే అక్కడికి వెళ్లిన వెంటనే పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లోనూ అవినీతి జరుగుతోందని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో ప్రారంభమైన టిమ్స్ ఆసుపత్రి పనులు ఇప్పటికీ పూర్తికాలేదని ప్రశ్నించిన క్రిషాంక్, బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

అనంతరం కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా టిమ్స్ పనులు 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడానికి కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అలాగే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఇటీవల చేసిన “కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాం.. గుమ్మడికాయ కొట్టి పూర్తి చేస్తాం” వ్యాఖ్యలను ప్రస్తావించిన క్రిషాంక్, కెసిఆర్ ప్రారంభించిన విషయం మర్చిపోయినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

పోలీసులు అనుమతి లేకుండా ఆసుపత్రి వద్దకు రావొద్దని చెబుతున్నారని ఆరోపించిన ఆయన, ఇది ప్రజల డబ్బుతో నిర్మించిన ఆసుపత్రి కాబట్టి ఎవరైనా సందర్శించే హక్కు ఉందన్నారు.

రానున్న ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal