● ప్రాణరక్షణలో చివరి ప్రత్యామ్నాయమేనని శేష్ పాల్ వైద్ అభిప్రాయం
● ఢిల్లీ ఘటనపై కొనసాగుతున్న వివాదం మధ్య స్పందన
హైదరాబాద్, జూలై 28: హింసాత్మక గుంపుల మధ్య విధులు నిర్వర్తించే పోలీసుల ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెల్లెట్ గన్ను చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగించడంలో తప్పేముందని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు.
“ఒక పోలీసు అధికారి హింసాత్మక గుంపు మధ్య చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అతను పెల్లెట్ గన్ ఉపయోగించాలా లేక రివాల్వర్ ఉపయోగించాలా?” అని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు ఎలాంటి ఆయుధాలు వినియోగించకూడదని ఆశిస్తూ, అదే సమయంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా కాపాడాలని కోరడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా, ప్రాణనష్టం తగ్గించే ఉద్దేశంతోనే పెల్లెట్ గన్ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారని ఆయన వివరించారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా భద్రతా బలగాలు పెల్లెట్ గన్లను ఉపయోగించాయనే ఆరోపణలు రావడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే ఆ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.
ఈ నేపథ్యంలో మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
#Sidhumaroju










