ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించడం ఇదే ప్రథమం. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మువ్వన్నెల వెలుగుల సాక్షిగా వందనం సమర్పించారు.
“స్వర్ణాంధ్ర-2047” ఇతివృత్తంతో (Theme) ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా బుల్లెట్ ఎస్కార్ట్ కాన్వాయ్లో వేడుకల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పోలీసు కంటింజెంట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఏపీఎస్పీ మరియు ఇతర పోలీస్ విభాగాల సంసిద్ధతను ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం ఏపీ పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు కర్ణాటక పోలీస్ బృందం పాల్గొన్న మార్చ్-పాస్ట్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం










