గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.|

0
5

● ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్.. 16 మంది వినియోగదారులు అదుపులో

● 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kush స్వాధీనం

● పట్టుబడిన మత్తు పదార్థాల విలువ రూ.16.40 లక్షలు

హైదరాబాద్, ఆగస్టు 19: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్‌ సరఫరాపై గచ్చిబౌలి పోలీసులు, ఎస్‌ఓటీ సైబరాబాద్‌ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లను అరెస్ట్‌ చేశారు. మరో 16 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 95.41 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kush, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల విలువ రూ.16,40,920గా పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 11న వట్టినాగులపల్లి కిండమ్ పబ్‌ రోడ్డులో కొరిపెల్ల యశ్వంత్ సాయి శన్ముఖ్‌ (26)ను 16 మంది వినియోగదారులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు కేరళకు చెందిన ఎండీ రజల్ అబ్దుల్ గఫూర్‌, బెంగళూరుకు చెందిన నవీనా కేడీ నుంచి MDMA తీసుకుంటున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

దీంతో ప్రత్యేక బృందాలను కేరళ, బెంగళూరుకు పంపిన పోలీసులు ఆగస్టు 18న త్రిశూర్‌లో రజల్ అబ్దుల్ గఫూర్‌ (26), బెంగళూరులోని బెగూర్‌లో నవీనా కేడీ (22)ను అరెస్ట్‌ చేశారు. రజల్‌ నుంచి 44.41 గ్రాముల MDMAను యశ్వంత్‌కు అందించినట్లు, దానిని ‘సామ్’ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి పొందినట్లు సమాచారం వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

నవీనా నివాసంలో నిర్వహించిన సోదాల్లో 51 గ్రాముల MDMA, 50 గ్రాముల OG Kush లభించాయి. వీటిని కేరళకు చెందిన తన స్నేహితుడు అనేశ్వర్‌ నుంచి తీసుకున్నట్లు ఆమె వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కేరళ, బెంగళూరు కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ సరఫరా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుల్లో రజల్ అబ్దుల్ గఫూర్‌ స్వస్థలం త్రిశూర్‌, కేరళ కాగా, ప్రస్తుతం బెంగళూరులోని బెగూర్‌లో నివసిస్తున్నాడు. నవీనా కేడీ కూడా బెగూర్‌లోనే ఉంటోంది. యశ్వంత్ సాయి శన్ముఖ్‌ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాగా, హైదరాబాద్‌లోని మూసాపేటలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న MDMA విలువ రూ.11,40,920 కాగా, OG Kush విలువ రూ.5 లక్షలుగా ఉంది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1431/2026గా NDPS Actలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఆపరేషన్‌ శేరిలింగంపల్లి జోన్‌ డీసీపీ సీహెచ్. శ్రీనివాస్‌, ఎస్‌ఓటీ సైబరాబాద్‌ డీసీపీ శోభన్ కుమార్, అదనపు డీసీపీ-1 టీ. గోవర్ధన్, అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి, నార్సింగి ఏసీపీ జి. వెంకట రమణ గౌడ్ పర్యవేక్షణలో జరిగింది. ఎస్‌ఓటీ సైబరాబాద్‌ బృందాలు, గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ, డీఐ, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

డ్రగ్స్‌, గంజాయి సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్‌-100 లేదా సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 8712663061కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

#sidhumaroju