ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు గజపతుల వారి ఆడపడుచు పైడిమాంబగా ప్రసిద్ధి. బొబ్బిలి యుద్ధంలో సోదరుడు విజయరామరాజు మరణ వార్తతో ఆమె కన్నుమూశారు. అనంతరం సైనికుడు పతివాడ అప్పలనాయుడికి కలలో కనిపించి తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని తెలిపినట్లు చరిత్ర చెబుతోంది. సరస్సులో లభించిన విగ్రహంతో విజయనగరంలో ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి అమ్మవారికి నిత్య పూజలు, ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.









