బళ్లారిలో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం: సుజ్లాన్ యార్డ్ సందర్శన|

0
0

ఏపీ మంత్రి నారా లోకేశ్ కర్ణాటకలోని బళ్లారిలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం బళ్లారిలోని జిందాల్ విజయ్‌నగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు కర్ణాటక మంత్రి నాగేంద్ర, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, పల్లె సింధూర రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్‌లతో పాటు టీడీపీ నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

తన పర్యటన సందర్భంగా బళ్లారి మండలం హాలకుందిలోని సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శించనున్నారు. అనంతరం, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు సుజ్లాన్ ‘S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్’ను అధికారికంగా ప్రారంభిస్తారు. 

 అనంతపురం జిల్లాలో సుజ్లాన్ సంస్థ రూ.10,000 కోట్ల భారీ పెట్టుబడితో 1,325 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 4,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.