ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ గడువు పొడిగింపు.

0
1

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ కమిషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీల) సామాజిక, రాజకీయ వెనుకబాటుతనంపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, నివేదిక సమర్పించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, నిర్దేశిత గడువులోగా నివేదిక సిద్ధం కాకపోవడంతో కమిషన్ పదవీ కాలాన్ని ఇప్పటికే పలుమార్లు పొడిగించారు. తాజాగా మరోసారి గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ సమర్పించే నివేదిక అత్యంత కీలకంగా మారనుంది.