జీహెచ్‌ఎంసీలో రూ.70 కోట్ల డబుల్ బిల్లుల బాగోతం.|

0
5

● ఒకే పనికి రెండుసార్లు చెల్లింపులు

● 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ

● ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రపై కమిషనర్ చర్య

ఆల్వాల్, సెప్టెంబర్ 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా రూ.70 కోట్లకు పైగా నిధులు చెల్లించినట్లు గుర్తించారు.

అదనపు మొత్తాన్ని తిరిగి రాబట్టే చర్యల్లో భాగంగా 11 మంది కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.7 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఒకే పనికి రెండుసార్లు బిల్లులు మంజూరు చేయడంతో పాటు, చెల్లించాల్సిన మొత్తం కంటే అధికంగా ఎక్సెస్ బిల్లులు కూడా జారీ చేసినట్లు విజిలెన్స్ పరిశీలనలో తేలింది.

ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

బిల్లుల మంజూరులో చోటుచేసుకున్న అక్రమాలకు బాధ్యత వహించినట్లు భావిస్తూ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్రను విధుల నుంచి తప్పించారు. కంప్యూటర్ ఆపరేటర్‌పై కూడా చర్యలకు రంగం సిద్ధమైంది.

డబుల్ బిల్లులకు సంబంధించిన ఫైళ్లు, సిఫారసు లేఖలు, డిజిటల్ సంతకాల వివరాలను అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు.

ఈ చెల్లింపుల వెనుక జరిగిన ప్రక్రియ, సంబంధిత సిబ్బంది పాత్ర, ప్రభుత్వ నిధులకు కలిగిన నష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

డబుల్ బిల్లుల పరిధి మరింత ఉందా, ఇంకా ఎంత మొత్తాన్ని తిరిగి రాబట్టాల్సి ఉందన్న అంశాలపై పూర్తి స్థాయి ఆడిట్ ద్వారా స్పష్టత రానుంది.

#sidhumaroju

Alwal