వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తిన భక్తులు
నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు
శుక్రవారం రోజు హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు
క్యూలైన్లలో భక్తులకు ఆహారం, తాగునీరు అందిస్తున్న టీటీడీ
వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిశాయి. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపలికి విస్తరించాయి.
ప్రస్తుతం టోకెన్లు లేని సాధారణ సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట రింగు రోడ్డు వరకు ఉన్న క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు నిరంతరం పాలు, తాగునీరు, అల్పాహారం అందజేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.










