తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి, పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధద్రవ్యాలతో స్నపనతిరుమంజనం నిర్వహించారు.
మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం ఘనంగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవ అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టిటిడి తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని రద్దు చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పుష్పయాగాన్ని తిలకించారు.



