రాబోయే మూడు నెలల్లో కె.బి.ఎన్. కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు*
కె.బి.ఎన్. పూర్వ విద్యార్థులు కాలేజీ అభివృద్దితో పాటు నగరాభివృద్ధికి సహకరించాలి*
పశ్చిమ నియోజకవర్గంలో మధ్య తరగతి విద్యాదీపం కెబిఎన్ కాలేజీ*
కెబిఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం (కోసా) ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి*
విజయవాడ, డిసెంబరు 28: దేశ విదేశాల్లో వేలాదిగా స్థిరపడిన కెబిఎన్ కాలేజీ పూర్వవిద్యార్థులందరూ కాలేజీ అభివృద్ధితో పాటు నగర అభివృద్దికి సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు.
కెబిఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం (కోసా) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కి కె.బి.ఎన్ .కాలేజీ కమిటీ సభ్యులతో పాటు కెబిఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం (కోసా) సభ్యులు ఘనస్వాగతం పలికారు.
పలు రంగాల్లో స్థిరపడిన కెబిఎన్ పూర్వ విద్యార్ధులైన మాజీ డి ఎస్ పి అశోక్ కుమార్ గౌడ్, సి ఛానెల్ సి ఈ ఓ రమేష్ బాబు, నటులు సుహాస్, సైకాలజిస్ట్ డాక్టర్ ఆర్.కె. అయోధ్య, ఐ ఎఫ్ ఎస్ అధికారి ( ఛత్తీస్ ఘడ్) జె.ఎ.సి.ఎస్.రావు, ప్రముఖ న్యాయవాది నందిపాటి శ్రీనివాసరావులతో పాటు విశ్రాంత అధ్యాపకులను ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మరో మూడు నెలల్లో కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పేద , మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు ఉత్తమ విద్యావకాశాలు కల్పించాలనే సమున్నత లక్ష్యంతో స్థాపించబడిన విద్యాసంస్థ కెబిఎన్ కాలేజీ అంటూ కొనియాడారు.
60 ఏళ్ళ వేడుక చేసుకుంటున్న కెబిఎన్ కాలేజీ పూర్వవిద్యార్థులు వేలాదిగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. చంద్రయాన్ ప్రయోగంలో కీలకమైన విడిభాగాలు తయారుచేసిన బి.ఎన్.రెడ్డి వంటి ప్రముఖుల ద్వారా కాలేజీ కీర్తి ఖండాంతరాలు దాటి వ్యాపించిందన్నారు. తాను ఇక్కడ చదువుకోకపోయినా, కెబిఎన్ కాలేజీ తన సొంత కాలేజీ అనే భావన కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో . కెబిఎన్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాజ రాఘవయ్య, సెక్రటరీ జె.ఎన్.శ్రీనివాస్, ఎస్ కె పి వి వి హిందూ హై స్కూల్స్ కమిటీ జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, కెబిఎన్ కాలేజీ సెక్రటరీ తూనుకుంట్ల శ్రీనివాసు, వైస్ ప్రెసిడెంట్ చిట్టూరి నాగేంద్ర, ప్రెసిడెంట్ ఉసిరిక ఉమా మహేశ్వరరావు
ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, హిందూ హై స్కూల్స్ పరిపాలనాధికారి డాక్టర్ వి.నారాయణరావు లతో పాటు కెబిఎన్ కాలేజీ పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.
