ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020 సెప్టెంబర్ 2న ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. అయితే విశాఖపట్నం జిల్లా (ప్రస్తుత అనకాపల్లి జిల్లా) కశింకోట మండలంలో కూడా అధికారులు దాడులు చేయగా.. లోటుపాట్లను గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తిని ప్రభుత్వ అనుమతి లేకుండా కంప్యూటర్ ఆపరేటర్గా నియమించారని తేలింది.
అంతేకాదు మరికొన్ని లోపాలను గుర్తించారు. కశింకోట మండలంలో పనిచేసిన తహసీల్దార్ సుధాకర్.. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఒక ప్రైవేట్ వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్గా నియమించి, వారికి నెలవారీ జీతం కూడా చెల్లించినట్లు విచారణలో తేలింది. ఇది తీవ్రమైన అవినీతి చర్యగా పరిగణించారు.
డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (ఆర్ఐలు) కూడా హాజరు రిజిస్టర్ నిర్వహణలో, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీలో, మీసేవ దరఖాస్తులను సకాలంలో ప్రాసెస్ చేయడంలో విఫలమయ్యారు. వారి కార్యాలయాల్లో బీరువాలో, చేతి సంచుల్లో డబ్బుల్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు.
పట్టాదారు పాస్పుస్తకాలను బాక్సుల్లో పెట్టి, వాటిని రిజిస్టర్లో నమోదు చేయకుండానే ఉంచడం, ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను డౌన్లోడ్ కూడా చేసుకోకుండానే గడువు ముగిసే సమయానికి తిరస్కరించడం వంటి నిర్లక్ష్య బయటపడింది.
కుల ధ్రువీకరణ పత్రాలు, మ్యుటేషన్, పట్టాదారు పాస్పుస్తకాల జారీ కోసం కూడా అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. రికార్డులను కూడా సరిగా నిర్వహించలేదని గుర్తించారు. ఈ అవకతవకలపై ఆధారాలతో సహా కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం 21 మంది రెవెన్యూ అధికారులు ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసిన తహసీల్దార్ కూడా ఉన్నారు. ఆధారాలతో సహా కేసు నమోదు చేయగా..
తాజాగా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు ఆర్ఐలు, 14 మంది వీఆర్వోలు, సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వోలు మ్యుటేషన్ దరఖాస్తుల్ని పరిశీలించకుండానే తిరస్కరించినట్లు తేలిందట.. అలాగే డబ్బులు డిమాండ్ చేసినట్లు గుర్తించారట.. డబ్బులు ఇవ్వకపోతే దరఖాస్తుల్ని తిరస్కరించారు.
