ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో వికాస్ హాస్పిటల్స్ ప్రధాన స్పాన్సర్గా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా నిర్విరామంగా మహిళలను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…
మహిళల ప్రతిభను వెలికి తీసేలా ఇలాంటి పోటీలను నిర్వహించడం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రజ్యోతి డీజీఎం శ్రీ రామచంద్రరావు గారికి, అలాగే ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన వికాస్ హాస్పిటల్స్ సీఎండీ శ్రీ గళ్ళా రామచంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముగ్గు అనేది కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదని, అది తెలుగు సాంప్రదాయానికి ప్రతీక అని ఎమ్మెల్యే గారు అన్నారు. నేటి తరం ముగ్గు పిండుల నుంచి చాక్పీస్లు, స్టిక్కర్లు, టైల్స్, పెయింటింగ్ల వైపు మళ్లుతున్నా.
మన సంప్రదాయాల వెనుక ఉన్న తత్వాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. బియ్యం పిండి, గోధుమ పిండితో వేసే ముగ్గుల ద్వారా చీమలు, కీటకాలకు కూడా తెలియకుండానే దానధర్మం చేస్తున్నామనే భావనను మన పెద్దలు మనకు నేర్పారని గుర్తు చేశారు.
ప్రతి శుభకార్యానికి, ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు అనివార్యమని పేర్కొన్నారు. ఇంతమంది మహిళలు ఎంతో శ్రద్ధతో, సమయం కేటాయించి, ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు.
పోటీలో పాల్గొన్న ప్రతి మహిళ విజేతేనని, భారతీయ సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకే వారు అభినందనీయులని తెలిపారు.
విజేతలుగా ఎంపికైన వారితో పాటు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. విజేతలుగా నిలవని వారు మరింత ఉత్సాహంతో, పోటీ భావనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మహిళల ద్వారా మన సంప్రదాయాన్ని బతికిస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
