ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ వ్యతిరేకి*
– అబద్ధపు ప్రచారాలు చేయడంలో జగన్ దిట్ట
– ఆనాడు వ్యతిరేకించి…నేడు తన వల్లే భోగాపురం ఎయిర్పోర్టు పూర్తైందని తప్పుడు ప్రచారాలు
– బహిరంగ సభ పెట్టి రైతులకు రెచ్చగొట్టింది జగన్ కాదా ?
– భోగాపురానికి ఎర్రబస్సు రాదు…ఎయిర్ బస్ ఎందుకు అన్నది జగన్ కాదా ?
– భోగాపురం ఎయిర్పోర్టు సీఎం చంద్రబాబు నాయుడు దత్త పుత్రిక
– ఆనాటి ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే
– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
*అమరావతి, జనవరి 5:* ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ అధినేత, ఎమ్మెల్యే జగన్ పూర్తిగా వ్యతిరేకిగా వ్యవహరించారని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రారంభిస్తే, జగన్ అప్పట్లో రైతులను రెచ్చగొట్టి అడ్డుకున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమరావతిలోని సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు నిలిపివేసి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని ఏళ్ల తరబడి వెనక్కి నెట్టారని విమర్శించారు.
ఇప్పుడు పనులు పూర్తయ్యే దశకు వచ్చిన తరువాత తానే చేశానని జగన్ చెప్పుకోవడం ఫేక్ రాజకీయానికి నిదర్శనమని, ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు అభివృద్ధికి కృషి చేశారో, ఎవరు అడ్డుపడ్డారో స్పష్టంగా గుర్తించారని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ప్రతి కీలక మౌలిక వసతి ప్రాజెక్టులోనూ జగన్ వైఖరి అభివృద్ధి నిరోధకమని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిజమైన చిహ్నం చంద్రబాబు నాయుడు నాయకత్వమేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం
విశాఖపట్నం జిల్లాలను కొందరు వెనుకబడిన ప్రాంతాలుగా చిత్రీకరిస్తున్నా, వాస్తవానికి ఈ ప్రాంతంలో అపారమైన వనరులు, శ్రమజీవి ప్రజలు ఉన్నారని, సరైన నిర్ణయాలు తీసుకొని అవకాశాలు కల్పిస్తే దేశంలోనే అత్యుత్తమ అభివృద్ధి సాధించే ప్రాంతంగా ఉత్తరాంధ్ర నిలుస్తుందని స్పష్టం చేశారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఉత్తరాంధ్రకు గౌరవం, గుర్తింపు వచ్చిందని, కనీస మౌలిక వసతులు కూడా లేని రోజుల్లో టీడీపీ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అభివృద్ధికి బీజం వేసిందని గుర్తు చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కృషికి ఫలితం. ఈ ప్రాజెక్టు ఆయనకు దత్తపుత్రికతో సమానం. పారిశ్రామిక అభివృద్ధికి అంతర్జాతీయ విమానాశ్రయం కీలకమని భావించిన సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్కు రూపకల్పన చేసి, మూడు జిల్లాలకు అనుకూలంగా జాతీయ రహదారి, సముద్రానికి సమీపంలో భోగాపురాన్ని ఎంపిక చేశారని, భూముల విషయంలో రైతులు సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో వందల సమావేశాలు నిర్వహించి న్యాయం చేశారని తెలిపారు. అయితే ఆ సమయంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ భోగాపురం ఎయిర్పోర్ట్కు తీవ్రంగా వ్యతిరేకించి రైతులను రెచ్చగొట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిందని.
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పనులు నిలిపివేసి ఉత్తరాంధ్ర అభివృద్ధిని వెనక్కి నెట్టిందని విమర్శించారు. ఇప్పుడు తానే ఎయిర్పోర్ట్ నిర్మించానని జగన్ ఫేక్ మాటలు మాట్లాడటం సిగ్గుచేటని, ప్రజలకు నిజం తెలుసునని అన్నారు. 2024 ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో నిరంతర సమీక్షలు చేసి, లక్ష్యానికి ముందే 95 శాతం పనులు పూర్తి చేసి తొలి విమానం ల్యాండ్ అయ్యే స్థాయికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఎంత తప్పుడు ప్రచారం చేసినా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వాల అభివృద్ధి సంకల్పానికి ప్రతీకగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని మంత్రి స్పష్టం చేశారు. ఆనాటి దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు పాలన నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వరకు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి నిరంతరంగా తెలుగుదేశం పార్టీ పాలనతోనే కొనసాగుతోంది. ఉత్తరాంధ్రకు నీళ్లు, రహదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు తీసుకొచ్చింది ఆనాటి ఎన్టీఆర్ అయితే, వాటిని విస్తరించి భవిష్యత్తు బాటలో నడిపిస్తున్నది నేటి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని తెలిపారు.
