ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ
భారత్ అవాజ్ న్యూస్… సూర్యమోహన్
తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పోలీస్ స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా భద్రతా కారణాల వల్ల బయటకు రాలేని బాధితులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారనుంది. ఫోన్ కాల్, ఆన్లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేయనున్నారు.
ఈ విధానం ద్వారా ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా గృహహింస, మోసం, వేధింపులు వంటి కేసుల్లో బాధితులకు ఇది ఎంతో సహాయపడనుంది.
ఇదిలా ఉండగా, సైబర్ నేర బాధితుల కోసం తెలంగాణ పోలీస్ శాఖ ప్రారంభించిన ‘సీ-మిత్ర’ సేవ మంచి ఫలితాలు ఇస్తోందని అధికారులు తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వారు తక్షణమే ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఈ సేవ ద్వారా లభిస్తోందని పేర్కొన్నారు.
