మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం…సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి షికా గోయల్ గారి ఆదేశాల మేరకు మరియు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి. వెంకట రంగారెడ్డి, ఇన్స్పెక్టర్ జె. కృష్ణమూర్తి, రామగుండం కమిషనరేట్ సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ నాగపూరి శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిబ్బంది కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కాలేజీ మరియు సింగరేణి మెడికల్ కాలేజీలో మహిళలు, కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
అదేవిధంగా కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లోని సైబర్ వారియర్స్ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆన్లైన్ గేమ్స్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లు, లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, ఫెడెక్స్ కొరియర్ మోసాలు, ఓటీపీ మోసాలు, ఓఎల్ఎక్స్ మోసాలను నమ్మి మోసపోకూడదని సూచించారు. అలాగే సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ఎటువంటి ఆన్లైన్ యాప్స్లో డబ్బులు పెట్టుబడి పెట్టకూడదని తెలిపారు.
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే అపరిచిత వ్యక్తుల కాల్స్ లేదా సందేశాలను నమ్మి ప్రజలు మోసపోకూడదని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ జె. కృష్ణమూర్తి తెలిపారు.
