Home South Zone Andhra Pradesh అమరావతిలో తొలి గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్ |

అమరావతిలో తొలి గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్ |

0

ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్
సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి విశ్వనగరం అవుతుందని ఆకాంక్ష

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుందని హామీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయని, ఈ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన సోమవారం తన స్పందనను తెలియజేశారు.

నేలపాడులోని పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పవన్ పేర్కొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని చక్కగా ప్రతిబింబించాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి సకల సౌకర్యాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకల వేదికపై నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసిందని కొనియాడారు.

భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకువెళతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

NO COMMENTS

Exit mobile version