ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ
ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత
ఫిబ్రవరి 1న బడ్జెట్, ఆదివారం కావడంతో ప్రభుత్వ నిర్ణయం
ఈ నెల 30నే సచివాలయాలకు నగదు విడుదల చేయనున్న అధికారులు
ఏపీలోని పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతినెలా అందించే పింఛన్లను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను డబ్బులను ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన నగదును ఈ నెల 30 నాటికే సచివాలయాలకు పంపించేందుకు చర్యలు చేపట్టారు.
సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి ఫిబ్రవరి 1న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఆదివారం కూడా వచ్చింది. ఈ కారణాల వల్ల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయించడం ఇబ్బంది అవుతుందని భావించిన ప్రభుత్వం, ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పింఛన్ల పంపిణీ తేదీలను ఇలా మార్చడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వం ఒకటో తేదీకి ముందే పింఛన్లు పంపిణీ చేసింది. సాధారణంగా నెల మొదటి తేదీన సెలవు దినం వచ్చినప్పుడు, లబ్ధిదారుల సౌకర్యం కోసం ముందుగానే నగదు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే జనవరి 1న నూతన సంవత్సరం సెలవు కావడంతో డిసెంబర్ 31నే పింఛన్లు అందజేశారు. ఇప్పుడు అదే తరహాలో ఫిబ్రవరి నెల పింఛన్లను కూడా ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించారు.
