ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా ‘నరుకుతం’. రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌

0
8

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపాటు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పాల్గొన్నారు.

‎సందర్భంగా వేదికపై మక్కాన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘మంత్రి శ్రీధరన్న ఇక్కడ ఉండక పోవచ్చు. రెండు గంటల్లో ఇక్కడ ఉన్న మేం (తనతోపాటు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చింతకుంట విజయరమణారావును చూపిస్తూ) ముగ్గురం ఒక్క క్షణంలో వస్తం. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

‎అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‎ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరికేస్తామనడంపై ప్రజాస్వామికవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

‎ఇటీవల అసెంబ్లీలో కేటీఆర్‌, హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మా దగ్గర కండలు తిరిగిన పహిల్వాన్లు ఉన్నరు. రాజ్‌ ఠాకూర్‌ ఉన్నడా?’ అంటూ రామగుండం ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే మక్కాన్‌ సింగ్‌ను ఉసిగొలిపి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మక్కాన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎంతమాత్రం మంచిది కాదని, వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు,

‎ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలే గానీ, ఇలా అడ్డంగా నరికేస్తామంటూ మాట్లాడుతారా? అని ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని హితవు పలుకుతున్నారు.