ఎమ్మియనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
0

మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడోన గ్రామం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దైవ దర్శనార్థం ప్రయాణిస్తున్న భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.

ఈ ఘటన కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు. రహదారి భద్రత, అత్యవసర వైద్య సదుపాయాలు, అంబులెన్స్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌మాద ప్రదేశాల సమీపంలో ట్రామా కేర్ సెంటర్లు, తక్షణ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రాణనష్టం పెరుగుతోందని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు గౌరవప్రదమైన పరిహారం వెంటనే ప్రకటించి అందజేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు గట్టిగా డిమాండ్ చేశారు

యాత్రికులు అధికంగా ప్రయాణించే మార్గాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థలు, అత్యవసర సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ