పలుకూరు యువకుల హైటెక్ మోసం

0
8

పలుకూరు యువకుల హైటెక్ మోసం

కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్ లో, IPL టికెట్ల దందాకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.

ఘట్టమనేని అశోక్ (రియల్ ఎస్టేట్ ఏజెంట్) కంకణాల దినేష్ (చార్టెడ్ అకౌంటెంట్), సింగమనేని వేణుమాధవ్ (బీటెక్).. వీరు ముగ్గురిది పాతికేళ్ల వయసు. వీరిలో ఘట్టమనేని అశోక్ మోసాలు చేయడంలో దిట్ట. తక్కువ టైమ్ లో, ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో, తమిళనాడుకు చెందిన మరో ముగ్గురితో కలిసి టీంగా ఏర్పడి మోసాలకు పాల్పడ్డారు.

ఐపీఎల్ టిక్కెట్లకు యువతలో మంచి డిమాండ్ ఉంది. దీనిని అడ్డం పెట్టుకుని.. విఐపి లెటర్లను అక్రమంగా సంపాదించి, వాటి ద్వారా వచ్చే టికెట్లను అమ్మాలని ప్లాన్ వేశారు. గవర్నర్లు, జడ్జీలు, మంత్రుల పేర్లతో హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ లకు మెయిల్స్ పెట్టారు. ప్రజాప్రతినిధిలే స్వయంగా టిక్కెట్లు అడుగుతున్నారని భావించి, క్రికెట్ అసోసియేషన్ వాళ్లు, కాంప్లిమెంటరీ ఐపీఎల్ టికెట్లను పంపించారు. ఆ టికెట్లను పలుకూరు యువకులు బ్లాక్ లో అమ్మడం మొదలుపెట్టారు.

ఈనెల 3వ తేదీన, హైదరాబాద్ – ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద ఈ ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. ఒక్కొక్కటి 22 వేల విలువచేసే 5 టికెట్లు, మహేంద్ర థార్ వాహనం, 5 ఫోన్లు, కొన్ని VIP ల లెటర్ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన మిగతా ముగ్గురు పరారయ్యారు.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఫోటోలు దిగటం, వారికి విలువైన బహుమతులు ఇస్తూ సన్నిహితంగా ఉండడం… ఘట్టమనేని అశోక్ కు బాగా అలవాటు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల పేరుతో లెటర్ ప్యాడ్ లను తయారుచేసి టీటీడీ దర్శనాలకు కూడా ఉపయోగిస్తుంటాడని పలువురు చెబుతున్నారు. పలుకూరుకు చెందిన మిగిలిన ఇద్దరు అమాయకులని, వారిని ట్రాప్ చేసి ఈ దందాలో ఇరికించినట్లు గ్రామస్తులు అంటున్నారు.