చిరు వ్యాపారులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లోని చేపల వంతెన ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్లపై రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, చిరు వ్యాపారులకు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ప్రత్యామ్నాయం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎమ్మార్వో కార్యాలయం, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి స్థలాల కొరత ఉందని, ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.










