ఎవరు దొంగలించలేని ఆస్తి విద్య ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజు,

0
2

చీరాల

బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని ఎన్.ఆర్ & పి.ఎం హైస్కూల్ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రథమ స్థానం సాధించిన జడ అభిషేక్‌కు రూ.5,000, ద్వితీయ స్థానం సాధించిన పట్నాల విజయేంద్రకు రూ.3,000, తృతీయ స్థానం సాధించిన పువ్వల మోనిష్ జోయల్‌కు రూ.2,000 నగదు బహుమతులను ఎమ్మెల్యే ప్రదానం చేసి అభినందించారు.

పదవ తరగతి ఫలితాల్లో జడ అభిషేక్ 570 మార్కులు సాధించి ప్రథమ స్థానం దక్కించుకోగా, పట్నాల విజయేంద్ర 561 మార్కులతో ద్వితీయ స్థానం, పువ్వల మోనిష్ జోయల్ 553 మార్కులతో తృతీయ స్థానం సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య మాట్లాడుతూ విద్యార్థుల విజయం వారి కృషికి, ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు పిల్లల విద్యపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించేందుకు, మరింత ప్రోత్సాహం అందించేందుకు నగదు బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఆఫీసర్ పి. సురేష్, ఉపాధ్యాయులు కే. హైమావతి, పీజీటి అపర్ణ, కే. వెంకటేశ్వర్ రెడ్డి, జి. జ్యోతి అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై విజేత విద్యార్థులను ఘనంగా అభినందించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.