మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్ఫోన్ డ్రైవింగ్పై మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.
కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్కరోజులోనే 1,340 కేసులు నమోదు చేసి రూ.13.39 లక్షల జరిమానాలు విధించారు.
ప్రధాన కూడళ్లు, సిగ్నల్ పాయింట్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు.
C.P. బి. సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ జోన్-I, జోన్-II పరిధిలో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగింది. డ్రైవింగ్ చేస్తూ మొబైల్లో మాట్లాడటం, మెసేజ్లు పంపడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియా వినియోగించడం వంటి ప్రమాదకర చర్యలను పోలీసులు ప్రత్యేకంగా గుర్తించి కేసులు నమోదు చేశారు.
సెల్ఫోన్ వాడకం వల్ల డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు.
“ఒక ఫోన్ కాల్ కాసేపు ఆగుతుంది… కానీ ఒక ప్రమాదం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది” అంటూ డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి ఫోన్ మాట్లాడాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కమిషనరేట్ వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు ఇకపై కూడా నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
#Sidhumaroju










