మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ పిలుపునిచ్చారు.
పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.
బక్రీద్ పండుగ నేపథ్యంలో నేరేడ్మెట్లోని సీపీ కార్యాలయంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మల్కాజిగిరి మున్సిపాలిటీ, వెటర్నరీ, రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఫైర్, మెడికల్, రోడ్డు రవాణా శాఖల ప్రతినిధులతో పాటు ముస్లిం మత పెద్దలు, గోరక్షక్ సభ్యులు విడివిడిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బక్రీద్ వంటి పండుగలను పరస్పర సహకారంతో, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవడం సమాజ ఐక్యతకు ప్రతీక అని అన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
అనుమానాస్పద వాహనాలు, అక్రమ రవాణా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని హెచ్చరించారు.
గోవులను తరలించే వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులపై దాడులు చేయడం లేదా బలవంతంగా తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడరాదని గోరక్షక్ సభ్యులకు సూచించారు.
అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే జంతువధ నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో జంతు అవశేషాలు వేయకుండా పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు.
ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, ఉప్పల్ డీసీపీ సురేష్, ఎస్బీ డీసీపీ జి. నరసింహారెడ్డి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, హెడ్క్వార్టర్ డీసీపీ శ్యాంసుందర్, అదనపు డీసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.
#Sidhumaroju







