కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత న్యూస్ ప్రతినిధి జగదీష్ :
ఆసిఫాబాద్: త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కంచకోట ప్రాంతంలో మురుగు కాలువలను జేసీబీ సహాయంతో మున్సిపల్ సిబ్బందితో శనివారం ముమ్మరంగా శుభ్రం చేయించారు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాకాలంలో పట్టణంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాలు పడేలోపే ప్రధాన డ్రైనేజీలను, సైడ్ కాలువలను పూర్తిగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. అయితే, మున్సిపల్ సిబ్బంది ఎంత శ్రమించినా ప్రజల సహకారం లేకపోతే ఫలితం ఉండదని, ఎవరూ కూడా కాలువల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు వేయకుండా పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకుడు సాయి శ్రావణ్, మున్సిపల్ అధికారులు, వార్డు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.








