అంగన్వాడీల వేతనాలు చెల్లించాలి: కాంగ్రెస్ సర్కార్పై హరీశ్ రావు ధ్వజం
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్తున్నారని, ముందు రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న 62 వేల మంది అంగన్వాడీల కష్టాలు తీర్చాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. మహిళా మంత్రి సీతక్క కూడా సాటి మహిళల కన్నీటి గోసను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
అధికారంలోకి వస్తే అంగన్వాడీల వేతనాలు రూ.18,000కు పెంచుతామని, ఈపీఎఫ్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ హయాంలో అంగన్వాడీల గౌరవాన్ని పెంచి, దేశంలోనే అత్యధిక వేతనాలు ఇచ్చామని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో సెక్రెటేరియట్’కు పిలుపునిచ్చిన అంగన్వాడీలపై పోలీసులను ప్రయోగించడం దుర్మార్గమన్నారు. పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.










