ద్రోణి ప్రభావం: ఏపీలో పలుచోట్ల వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాయలసీమ, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
బుధవారం శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం కురవగా, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో గరిష్ఠంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం పరిసరాల్లో వీచిన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగాయి. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.










