🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
జైనూర్ మండలం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంటనే 40 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న సిర్పూర్ (యూ), లింగాపూర్, తిర్యాణి, కెరమెరి, నార్నూర్ మండలాల ఆదివాసీ ప్రజలకు ప్రధాన వైద్య కేంద్రంగా సేవలు అందిస్తోందని తెలిపారు.
అయితే, ప్రస్తుతం ఇక్కడ పడకలు, వైద్యులు, నర్సులు, అవసరమైన వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం కూడా స్థానిక పేద ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, దీనివల్ల ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో, ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసి, పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని, ఆధునిక వైద్య పరికరాలను మరియు మెరుగైన సౌకర్యాలను కల్పించాల్సిందిగా కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారని, ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సుగుణక్క తెలిపారు.










