జులై 3వ వారంలో ‘తల్లికి వందనం’: మంత్రి లోకేశ్ సమీక్ష|

0
0

 

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష

16-06-2026 Tue 

Andhra

Nara Lokesh reviews Education Department Thalliki Vandanam to launch in July third week

వచ్చే నెలలో ‘తల్లికి వందనం’ పథకం అమలుకు చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం

జూన్ 29న షైనింగ్ స్టార్స్, జులైలో మెగా పీటీఎం నిర్వహణకు నిర్ణయం

వివిధ ‘సెట్’లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన

ఏపీకి ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

 

ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ‘తల్లికి వందనం’ పథకం అమలుపై ప్రధానంగా చర్చించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. 

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం, తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు జులై మూడో వారంలో ‘మెగా పీటీఎం’ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపైనా చర్చించారు.

 

పాఠశాల విద్యపై సమీక్ష అనంతరం, ఉన్నత విద్యారంగంపై మంత్రి లోకేశ్ దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్వహించే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్ వంటి 12 రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్)ల నిర్వహణలో ఎలాంటి జాప్యం జరగకూడదని గట్టిగా ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల సెట్ల తేదీలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ఖరారు చేయాలని స్పష్టం చేశారు. 

 

రాష్ట్రంలోని 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఎప్‌సెట్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని, ముఖ్యంగా డిమాండ్ ఉన్న మెకానికల్, సివిల్ బ్రాంచ్ లపై దృష్టి పెట్టాలని సూచించారు.