
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://* *సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావు లాకర్లలో గుట్టలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం!.* ప్రజాధనాన్ని నిలువునా దోచుకుంటూ, లంచాల మరిగిన అవినీతి తిమింగలాల అసలు రంగు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం జరిపిన సోదాలు విస్తుగొలిపే నిజాలను వెలుగులోకి తెచ్చాయి. కోర్టు వారెంట్లతో హైదరాబాద్ శాలిబండలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్లో ఉన్న నరహరిరావు భార్య పేరు మీది రెండు బ్యాంక్ లాకర్లను అధికారులు తెరిచారు. అందులో దొరికిన సొమ్ము చూసి ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. *లక్షలు కాదు.. ఏకంగా కోటిన్నర నగదు!* ఆ లాకర్లలో గుట్టలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూస్తే సామాన్యుడి గుండె ఆగుతుంది. అక్రమంగా ఆర్జించిన రూ. 1,50,00,000/- (కోటి యాభై లక్షల రూపాయల) కరకరలాడే నోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది చాలదన్నట్టు.. ఒక్కొక్కటి 100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లు, రెండు కిలోల బరువు తూగే విలువైన బంగారు, వజ్రాభరణాలను ఏసీబీ సీజ్ చేసింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో అరెస్టయి జుడీషియల్ కస్టడీలో చిప్పకూడు తింటున్న ఈ అవినీతి అధికారి గుట్టు, లాకర్ల సోదాతో పూర్తిగా రచ్చకెక్కింది. ప్రజాధనం దోచుకునే మీ బతుకులెందుకు? సామాన్య ప్రజలు రెక్కలముక్కలు చేసుకుని, చెమటోడ్చి సంపాదించే రూపాయి రూపాయిని లంచాల రూపంలో మింగేస్తూ.. ఇలా లాకర్లలో కోట్లకు కోట్లు దాచుకుంటున్న ఈ అవినీతి తిమింగలాల బతుకులను చూస్తే సమాజం అసహ్యించుకుంటోంది. “ఎందుకురా మీ బతుకులు?” అని జనం ఛీత్కరించుకునేలా ఉంది వీరి తీరు. ప్రజల సేవ చేయాల్సిన కుర్చీల్లో కూర్చుని, అధికార మదంతో కళ్లు మూసుకుపోయి, ఇలా అవినీతి సామ్రాజ్యాలను నిర్మించుకోవడం సిగ్గుచేటు. చట్టబద్ధంగా వచ్చే జీతాలు సరిపోకనా ఈ కక్కుర్తి, ఈ రాక్షసానందం? రేపో మాపో దొరికిపోతామన్న కనీస భయం లేకుండా, పాపపు సొమ్ముతో లాకర్లు నింపుకున్న ఇలాంటి వారి బతుకులు చివరికి జైలు గోడల మధ్యే ముగుస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం నరహరిరావుకు సంబంధించిన మరిన్ని అక్రమాస్తుల వెలికితీతపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.