ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
పాల్గొన్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు.
• కెసిఆర్ హయాంలో రైతును రాజుగా గౌరవించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.
• రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు.
• తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపిన ఘనత కెసిఆర్ రైతు సంక్షేమ విధానాలదే.
• రైతులకు పెట్టుబడి సహాయం అందించి సాగు విస్తీర్ణాన్ని పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం.
• కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలం.
• యాప్ల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం.
• రైతుల కష్టాలను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్ బిగాల.
• రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని విమర్శ.
“ఎద్దు ఏడ్చిన, ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు” అని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
కెసిఆర్ గారి హయాంలో రైతును రాజుగా భావించి రైతు సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి సంవత్సరానికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించారని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచారని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలను సబ్సిడీలపై అందించి రైతుల శ్రమను తగ్గించారని పేర్కొన్నారు.
అలాగే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను వ్యవసాయ రంగానికి అందించడం ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే పరిస్థితులు కల్పించారని అన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందించడం ద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు.
దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 50 శాతానికి పైగా వాటా సాధించి దేశానికే అన్నపూర్ణగా నిలిచిందంటే అది కెసిఆర్ గారు అమలు చేసిన రైతు అనుకూల విధానాల ఫలితమేనని పేర్కొన్నారు. రైతుబంధు పథకం ద్వారా సుమారు రూ.77 వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, రైతులకు రూ.27 వేల కోట్లకు పైగా రుణ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు.
రైతు కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. ఈ పథకం కింద వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడంతో పాటు రూ.6,800 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు.
ఇక నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. వర్షాకాలం సాగు ప్రారంభమైన సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరించి యాప్లు, ఆన్లైన్ విధానాల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
రైతు కష్టాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించే ఏ ప్రభుత్వం అయినా ప్రజల మద్దతు కోల్పోతుందని హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఎరువులు, విత్తనాలు, సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









