ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆకస్మిక తనిఖీ:
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఈస్ట్ మారేడ్పల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాలలోని తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా బోర్వెల్ ఏర్పాటు, ప్రహరీ గోడ పెంపు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, సిబ్బంది ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమస్యలను త్వరలోనే పరిష్కరించి మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన సాంకేతిక విద్య ద్వారా యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.










