శారీరక దృఢత్వం..సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ‘Sunday’s on Cycle’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎ.ఆర్ డి.ఎస్.పి శ్రీ పి. నాగేశ్వర రావు
కడప జూన్ 28: శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని ఎ.ఆర్ డి.ఎస్.పి శ్రీ పి. నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు, జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు “సండేస్ ఆన్ సైకిల్”, కార్యక్రమాన్ని ఎ.ఆర్ డి.ఎస్పీ శ్రీ పి. నాగేశ్వర రావు ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం లో జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఎన్టీ ఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లి, మహావీర్ సర్కిల్, డా. బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్, ఎస్పీ బంగ్లా, కో ఆపరేటివ్ కాలనీ మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్బంగా ఎ.ఆర్ డి.ఎస్పీ పి. నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ సైక్లింగ్ సహజసిద్ధమైన వ్యాయామమని తెలిపారు. ప్రతి ఆదివారం పోలీసులు, ప్రజలు సైక్లింగ్ ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతకు సాయపడుతుందన్నారు.
క్రమం తప్పకుండ సైక్లింగ్ చేయడం వల్ల క్యాలరీలు ఖర్చయి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందన్నారు. రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సైక్లింగ్ సహాయపడుతుందని తెలిపారు.
పోలీస్ సిబ్బంది తో పాటు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొద్ది సమయాన్ని శారీరక వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించినపుడే కుటుంబం సంతోషంగా ఉంటుందని, పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని తెలిపారు.
ఆధునిక జీవన శైలి లో వాహనాలలో ప్రయాణించడం అందరికి అలవాటుగా మారిందని, సైక్లింగ్ ద్వారా పర్యావరణానికి మేలు చేయడంతో పాటు మన ఆరోగ్యం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ లు సోమశేఖర్ నాయక్, పెద్దయ్య, టైటస్, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









