“డాక్టర్స్ డే వేడుకల్లో వైద్యులకు సన్మానం”
మేడ్చల్ మల్కాజిగిరి: డాక్టర్ల సేవలు అమూల్యమైనవని, అందుకే వారిని “వైద్య నారాయణో హరి” అంటూ భగవంతునితో పోలుస్తారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు.
డాక్టర్స్ డే సందర్భంగా వనస్థలిపురంలోని లక్ష్మి హాస్పిటల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ వార్డును ప్రారంభించారు.
అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి అవార్డులు అందజేసి, వైద్యులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు.
డాక్టర్లు ఎంత ఒత్తిడి ఉన్నా ఓర్పుతో ప్రజలకు సేవలందిస్తారని, వారి సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొంటూ, డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి, లచ్చిరెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, రాణా ప్రతాప్, డాక్టర్లు శ్రీకాంత్, శ్వేత, వంశీ, సృజన తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju









