“20. లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ.. ముగ్గురు అరెస్ట్”
మేడ్చల్ మల్కాజ్ గిరి : అల్వాల్ పోలీసుల వేగవంతమైన దర్యాప్తుతో భారీ ఇంటి చోరీ కేసు ఛేదనకు వచ్చింది. ఇంటి యజమాని కుటుంబం స్వగ్రామానికి వెళ్లిన అవకాశాన్ని వినియోగించుకున్న వాచ్మన్ చోరీకి పాల్పడగా, దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేసిన మరో ఇద్దరితో కలిసి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.20.20 లక్షల విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అల్వాల్కు చెందిన మేడిశెట్టి శ్యామ్రావు కుటుంబంతో కలిసి జూన్ 3న స్వగ్రామానికి వెళ్లి, జూన్ 27న తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తాళం, బెడ్రూమ్ బీరువా ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోనే ఉన్న తాళాలతో గోద్రేజ్ లాకర్ తెరిచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును అపహరించినట్లు గుర్తించి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు క్రైమ్ నం.631/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు జూలై 3న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కొల్లి లోవరాజు (వాచ్మన్), పాపాని రాజు (డెలివరీ బాయ్), మైలారం మహేష్ చారి (స్వర్ణకారుడు) ఉన్నారు.
ప్రధాన నిందితుడు కొల్లి లోవరాజు బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లిన విషయం తెలుసుకుని ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగులగొట్టాడు. అనంతరం ఇంట్లోనే ఉన్న తాళాలతో లాకర్ తెరిచి బంగారం, వెండి వస్తువులు, నగదును అపహరించాడు. అనంతరం దొంగిలించిన ఆభరణాలను పాపాని రాజు ద్వారా స్వర్ణకారుడు మైలారం మహేష్ చారికి విక్రయించినట్లు విచారణలో తేలింది.
నిందితుల వద్ద నుంచి 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటిలో నల్లపూసల గొలుసులు, పుస్తెల తాడు, బంగారు పెండెంట్లు, చెవిపోగులు, ఉంగరాలు, బంగారు బిస్కెట్, వెండి మొలతాడు, వెండి బిస్కెట్, వెండి పూజా సామగ్రి ఉన్నాయి.
ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన నగలు, పత్రాలను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని పోలీసులు సూచించారు. అలాగే ఇంటి పనివారు, వాచ్మన్ల వివరాలను స్థానిక పోలీసుల ద్వారా ధృవీకరించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేసిన దర్యాప్తు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
#Sidhumaroju
Alwal










