డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|

0
6

“నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్”

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 11:- జవహర్‌నగర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, డంప్ యార్డును తరలించి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.

డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జవహర్‌నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసిన నేపథ్యంలో షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఈటల రాజేందర్, నిరసనకారులను పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో జవహర్‌నగర్‌లో స్థానిక ప్రాంతాల చెత్త మాత్రమే డంప్ చేసేవారని, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారీ స్థాయిలో చెత్తను ఒకే ప్రాంతంలో వేయడం వల్ల జవహర్‌నగర్, బాలాజీనగర్‌తో పాటు పరిసర ప్రాంతాలు తీవ్ర కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, లీచేట్ వాటర్ శుద్ధి వంటి చర్యలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, దీంతో పర్యావరణం, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. గతంలో ఈ సమస్యపై పోరాడిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని, అరెస్టులు, కేసులు సమస్యకు పరిష్కారం కావని ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని చెత్తను ఒకే ప్రాంతంలో వేయకుండా వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించి, జీరో పొల్యూషన్ లక్ష్యంతో ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

#Sidhumaroju