మదనపల్లెలో ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ ఆకస్మిక తనిఖీలు|

0
2

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బీసెంట్ సర్కిల్ నుంచి సంఘం ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన వెళ్లి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

 

ఈ సందర్భంగా రహదారులకు ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న దుకాణాల ఆక్రమణలు, తోపుడు బండ్లను వెంటనే తొలగించుకోవాలని వ్యాపారులకు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు, వ్యాపారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.

 

అలాగే వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, మున్సిపాలిటీ నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా రద్దీని తగ్గించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

 

ఈ తనిఖీలలో ట్రాఫిక్ సీఐ గురునాథ్, వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ గాయత్రి, ఆర్ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.