Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సమస్యను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతిని ఆశ్రయించారు.
తన పంచాయతీ పరిధిలోకి కోళ్లబైలు గ్రామం రాకపోయినా, గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించిన చలపతి వెంటనే స్పందించి, తన సొంత ఖర్చులతో కాలిపోయిన బోరు మోటర్ను మరమ్మతు చేయించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు.
దీంతో గ్రామ ప్రజలు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం పొందారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సుమారు రూ.50 వేల వ్యయంతో కొత్త పైప్లైన్తో పాటు నీటి నిల్వ ట్యాంకును కూడా ఏర్పాటు చేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు త్వరలోనే చేపడతామని తెలిపారు.
తమ సమస్యను వెంటనే పరిష్కరించి, శాశ్వత పరిష్కారం దిశగా కూడా ముందుకొచ్చిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన సేవాభావం, మానవత్వాన్ని అభినందించారు.










