మదనపల్లె: ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండగా, పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి.
మరోవైపు మున్సిపల్ కుళాయిల ద్వారా కూడా తగినంత నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని అనేక వార్డులు, కాలనీల్లో రెండు నుంచి మూడు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కుళాయిలు పూర్తిగా ఎండిపోవడంతో తాగునీటితో పాటు నిత్యావసర అవసరాలకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు తెల్లవారుజాము నుంచే ఖాళీ బిందెలతో నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ నీటి సరఫరా సరిపోకపోవడంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లే ప్రజలకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఒక్కో ట్యాంకర్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచ్చిస్తూ నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.










