టీపీసీసీ కీలక నిర్ణయం…పాలభిషేకాలు, జేసీబీలపై నిషేధం.|

0
29

హైదరాబాద్, జూలై 16 : కాంగ్రెస్ పార్టీ అధికారిక వేడుకలు, కార్యక్రమాల్లో ఆడంబరాలకు, ఆహార వృథాకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్వహించే ఎలాంటి కార్యక్రమాల్లోనైనా సరే పాలభిషేకాలు, జలాభిషేకాలు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ టి. కుమార్ రావు ఒక అధికారిక సర్క్యులర్ లేఖను విడుదల చేశారు.తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది.

దేశంలో ఎంతో మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటే, వేడుకల పేరిట పాలను, ఇతర ఆహార పదార్థాలను వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు పూర్తి విరుద్ధమని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇటువంటి వృథా పనులకు స్వస్తి చెప్పి, పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో సీనియర్ నాయకుల పర్యటనల్లో జేసీబీలు, బుల్డోజర్లు, భారీ క్రేన్లను ఉపయోగించి భారీ పూలదండలు వేసే సంస్కృతిపై టీపీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుల్డోజర్లు, జేసీబీ వంటి వాహనాలు అణచివేతకు ప్రతీకలని, ప్రజా పక్షాన నిలిచే కాంగ్రెస్ సంస్కృతికి ఇవి ఏమాత్రం తగవని స్పష్టం చేసింది.ఇకపై పార్టీ నాయకుల సన్మానాల కోసం ఇలాంటి భారీ యంత్రాలను ఉపయోగిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఈ కొత్త నిబంధనలను రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అందరూ కచ్చితంగా పాటించాలని టీపీసీసీ స్పష్టం చేసింది.

#Sidhumaroju